రామాలయంలో చోరీ
– రూ.4లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరణ
వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులోని టీచర్స్ కాలనీలో ఉన్న శ్రీరాముని ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయం వాకిళ్లు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు రూ.4లక్షలు విలువ చేసే బంగారు నగలు, వెండి కిరీటాలు అపహరించారు. ఆ కాలనీ వాసులు తెల్లవారిన తర్వాత ఆయల వాకిళ్లు తెరిచి ఉంచడంతో ఎవరో దొంగలు పడ్డారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు స్థానిక సీఐ చాంద్ బాషా, ఎస్ఐ తిరుపాల్ నాయక్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
వేంపల్లెలో బైకు చోరీ..
స్థానిక హనుమాన్ జంక్షన్ సమీపంలో పాల వ్యాపారం చేసుకునే రామచంద్రారెడ్డి అనే వ్యక్తి బైకు చోరీకి గురైంది. మంగళవారం తన వ్యాపారం ముగించుకుని రాత్రి యధావిధిగా తన ఇంటి ముందు బైకు, ఆటోను పార్కు చేశారు. తెల్లవారుజామున పాల వ్యాపారం కోసం బయటకు వచ్చి చూడగా తన బైకు కనిపించలేదు. ఆటోకు వైర్లు కట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బైకు తాళం పగులగొట్టి ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు రామచంద్రారెడ్డి వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.