జేఎన్టీయూ నూతన పాలక భవనం ప్రారంభం
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శనివారం వర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలక భవనాన్ని వర్చువల్గా ప్రారంభించారు. రూ.36.65 కోట్లతో 11 వేల చదరపు మీటర్లలో అత్యాధునికంగా భవనాన్ని నిర్మించారు. ఇకపై ఈ భవనం నుంచే పాలన వ్యవహారాలు కొనసాగనున్నాయి. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని కొనియాడారు.
ముగిసిన
‘పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్’
● ఓవరాల్ చాంపియన్షిప్ కృష్ణా రీజియన్
● ఖోఖో విజేత అనంత పురం
అనంతపురం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల 26వ స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ఓవరాల్ చాంపియన్షిప్గా కృష్ణా రీజియన్ నిలిచింది. ఖోఖో విజేతగా, వాలీబాల్ విభాగంలో ద్వితీయ స్థానంలో అనంతపురం నిలిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్డీటీ డైరెక్టర్ డాక్టర్ హరినారాయణ, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాలిటెక్నిక్ కళాశాలల ఆర్జేడీ నిర్మల్కుమార్ ప్రియ, ఆంధ్ర రీజియన్ ఆర్జేడీ జేవీ సత్యనారాయణ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు.