మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
అనంతపురం మెడికల్: విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లరాదని అడిషినల్ సెషన్స్ జడ్జి హరిత వైద్య సూచించారు. శనివారం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ వైద్య వృత్తి గౌరవప్రదమైనదన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ముందుకు వస్తున్నారన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ షారోన్ సోనియా, ఫోరెన్సిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్ శంకర్ నాయక్, సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ వైద్యనాథ్, ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ గాలేటి చంద్రశేఖర్, డాక్టర్ రమేష్బాబు, తదితరులున్నారు.