మరో 6 నెలల గడువు ఇవ్వండి..
ABN , First Publish Date - 2023-04-30T02:23:54+05:30 IST
అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో పాటు సమాచార బహిర్గత నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు గడువును 6 నెలలు పొడిగించాలని సుప్రీంకోర్టును సెబీ కోరింది.
● అదానీ షేర్ల ధరల్లో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు పూర్తికి అదనపు సమయం కోరిన సెబీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో పాటు సమాచార బహిర్గత నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు గడువును 6 నెలలు పొడిగించాలని సుప్రీంకోర్టును సెబీ కోరింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై రెండు నెలల్లో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని గత నెల 2న సెబీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, దేశీయ మదుపరుల ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేయడంతో పాటు నియంత్రణపరమైన వైఫల్యాలపై దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. అదానీ గ్రూప్ చాలాకాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడటంతోపాటు అక్రమ విధానాల్లో కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ జనవరి 24న విడుదల చేసిన నివేదికలో ఆరోపించింది. దాంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. ఒక దశలో గ్రూప్ మార్కెట్ విలువ సగానికి పైగా తగ్గింది.