బైకును ఢీకొన్న లారీ

ప్రమాదం జరిగిన ప్రాంతం  - Sakshi

ఇద్దరి దుర్మరణం

యాడికి: మండల పరిధిలోని రాయల చెరువు– తాడిపత్రి రహదారిపై మోడల్‌ స్కూల్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోహన్‌ (27), సునీల్‌ (22) అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌ పల్లికి చెందిన మోహన్‌, సునీల్‌ స్నేహితులు. శనివారం ద్విచక్ర వాహనంపై తాడిపత్రి వెళ్లారు. ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేయించుకున్న అనంతరం పీఆర్‌ పల్లికి బయలు దేరారు. మార్గం మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా లారీ వేగంగా ఢీకొంది. మోహన్‌ లారీ చక్రాల కింద పడి మృతి చెందగా, సునీల్‌ రోడ్డుపై పడి ప్రాణాలు విడిచాడు. మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. కుమారుల మృతదేహాల వద్ద లక్ష్మినారాయణ, శ్రీరాములు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని సీఐ శంకర్‌ రెడ్డి, ఎస్‌ఐ గురు ప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top