కొత్తకార్డులకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కొత్తగా 5,708 బియ్యం కార్డులు మంజూరు చేసింది. 12,793 మంది సభ్యులకు లబ్ధి చేకూరనుంది. కొత్త కార్డుదారులకు ఈ నెల నుంచే బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్ వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 6.63 లక్షలు బియ్యం కార్డులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వీటికి ప్రతినెలా నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. కొత్తగా బియ్యం కార్డులను ఏడాదికి రెండు సార్లు జూన్, డిసెంబర్ నెలద్లి మంజూరు చేస్తుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో అర్హులై ఉండి గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు కొత్త బియ్యం కార్డు, కార్డు విభజన కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ కొత్తగా బియ్యం కార్డును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మంజూరైన కార్డుదారులకు ఈనెల నుంచే సరుకులు, బియ్యం పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎండీయూ వాహనం ద్వారా ఇంటి వద్దనే సరుకులు, బియ్యం పొందాలని సూచించారు.