రికార్డు స్థాయిలో సుబ్బారాయుడి ఆదాయం
మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కానుకల ఆదాయం రూ.1,03,83,725 వచ్చినట్లు ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావు తెలిపారు. మోపిదేవి దేవస్థానంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు సమక్షంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ 95 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలు రికార్డు స్థాయిలో వచ్చినట్లు తెలిపారు. బంగారం 90 గ్రాములు, వెండి 4 కిలోల 700 గ్రాములు, అమెరికన్ డాలర్లు 219, అరబ్ దిరామ్స్ 10, ఆస్ట్రేలియన్ డాలర్లు 10, సింగపూర్ డాలర్లు 14, ఇంగ్లాండ్ పౌండ్స్ 15, శ్రీలంక రూపాయలు 240 వచ్చినట్లు వివరించారు. కోడూరు గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి సీహెచ్ సుధాకరరావు, చల్లపల్లి ఎస్టేట్ ఆలయాల అధికారులు, పోలీస్ సిబ్బంది, పలువురు భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.