రేపు జిల్లా హాకీ జట్టు ఎంపిక
మచిలీపట్నంటౌన్: ఈనెల 7 వ తేదీ ఆదివారం జిల్లా జూనియర్ బాలుర హాకీ జట్టు ఎంపిక జరుగుతుందని హాకీ అసోసియేషన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.హరికృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి స్థానిక నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. 2005 జనవరి 1 వ తేదీ తర్వాత పుట్టిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు.
గంజాయితో పట్టుబడిన యువకులకు రిమాండ్
గన్నవరం: మండలంలోని అల్లాపురం శివారులో ఐదుగురు యువకులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం...అల్లాపురం పరిధిలోని ఏలూరు కాలువ గట్టు వద్ద డీఎస్పీ జయసూర్య ఆదేశాల మేరకు సీఐ పి.కనకారావు, ఎస్ఐ నవీన్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో గంజాయి తాగేందుకు అటుగా వచ్చిన కొండా వెంకటేశ్వరరావు, దుంపల ఈశ్వర్ రాంబాబు, తాడిశెట్టి లక్ష్మణరాయుడు, నంద్యాల క్రాంతికుమార్, కాట్రు దినేష్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న అర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. వీరికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు చెప్పారు. గంజాయి కట్టడికి చర్యలు తీసుకున్న సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.