ఉప కులాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో కొండ సవరలు, కొండ రెడ్డి, కుటియా ఖోండ్ తదితర 11 ఎస్టీ ఉప వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆదేశించారు. పీఎం జన్మన్ పథకం ద్వారా బలహీన, గిరిజన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చి వారిని అభివృద్ధి దిశగా నడిపించే క్రమంలో అధికారులకు మార్గనిర్దేశనం చేసేందుకు కలెక్టర్ ఢిల్లీరావు గిరిజన సంక్షేమ అధికారి జె.సునీతతో కలిసి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులతో శుక్రవారం వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండ సవరలు, కొండ రెడ్డి, కుటియా ఖోండ్, డోంగ్రియా ఖోండ్, చెంచు, బోడో గదబ, గుటోబ్ గదబ, పరేంజి పోర్జా, ఖోండ్ పోర్జా, బోండో పోర్జా, కోలమ్ గిరిజన వర్గాల (పీవీటీజీ) ప్రజల స్థితిగతులకు సంబంధించి ఎంపీడీవోలు సమగ్ర సమాచారంతో నివేదికలు అందించాలన్నారు. నిర్దేశ ప్రొఫార్మాలో వివరాలు పొందుపరచాలన్నారు. 11 గిరిజన వర్గాల ప్రజలకు సొంతిల్లు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, టెలికం అనుసంధానం తదితర ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఆయా వర్గాల ఆవాసాలను రహదారులతో అనుసంధానించేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గిరిజన ఉప వర్గాల ప్రజలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అమలుచేస్తున్న కార్యక్రమాల ఫలాలు వారికి అందేలా చూడాలన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకుని ఎదిగేందుకు దారి చూపాలన్నారు. ఇందుకు గిరిజన, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొండ సవరలు, కొండ రెడ్డి తదితర 11 ఎస్టీ ఉప వర్గాల ప్రజలను గుర్తించండి
క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశాలు