మెరుగైన సేవలు అందిస్తున్న సహకార బ్యాంకులు
డీసీఓ ఫణికుమార్
మచిలీపట్నంటౌన్: సహకార బ్యాంకులు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటున్నాయని జిల్లా సహకార అధికారి వి.వి.ఫణి కుమార్ అన్నారు. స్థానిక సిరి కల్యాణ మండపంలో శుక్రవారం ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ మచిలీపట్నం బ్రాంచ్ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీఓ ఫణికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్యాంకు ఇన్చార్జి డైరెక్టర్ పి.వి.రమణరావు అధ్యక్షత వహించిన సమావేశంలో డీసీఓ మాట్లాడుతూ మచిలీపట్నం బ్రాంచ్ 1240 మంది సభ్యులతో రూ.14.81 కోట్ల డిపాజిట్లతో, రూ.34.25 కోట్ల రుణాలు ఇచ్చి ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ అధికారి కె.భాస్కరరావు, వక్కలగడ్డ పీఏసీఎస్ చైర్మన్ సురేంద్రనాథ్ బెనర్జీ, మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, బ్యాంకు డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు, బ్యాంక్ జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అజయ్కుమార్, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలుగురు ఖాతాదారులను ఘనంగా సత్కరించారు. తొలుత శ్రీ బాలాజీ విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.