పాత్రికేయుల పాత్ర గణనీయమైనది
కలెక్టర్ రాజాబాబు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో పాత్రికేయుల పాత్ర గణనీయమైనదని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మచిలీపట్నంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు శుక్రవారం ఆయన డైరీలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన పాత్రికేయులకు నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో పెద్ది రోజా, ఆర్డీవో ఎం.వాణి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, పాత్రికేయులు పాల్గొన్నారు.
మాల, మాదిగలకు సమానంగా సీట్లు కేటాయించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాల, మాదిగలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సమానంగా కేటాయించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య అన్ని రాజకీయ పార్టీలను కోరారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదిగలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని నాలుగు ఎంపీ రిజర్వుడు స్థానాల్లో రెండింటిని మాదిగలకు కేటాయించాలని కోరారు. 29 ఎమ్మెల్యే స్థానాల్లో మాల, మాదిగలకు సమానంగా కేటాయించాలన్నారు.