టేక్ హోం రేషన్ కిట్లను తక్షణమే పంపిణీ చేయాలి
● అధికారులను ఆదేశించిన
జేసీ నారపురెడ్డి మౌర్య
కర్నూలు(సెంట్రల్): బాలింతలు, గర్భిణులకు టేక్ హోం రేషన్ కిట్లను తక్షణమే అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో టేక్ హోం రేషన్ కిట్ల పంపిణీపై సంబంధిత అధికారులతో జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం అంగన్వాడీలు సమ్మెలో ఉండడంతో టేక్ హోం రేషన్ కిట్లను ఎండీయూ ఆపరేటర్లు, వలంటీర్లతో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ డీలరు ప్రతి నెలా 30వ తేదీ లోపు రేషన్ను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తీసుకెళ్లేలా చూడాలన్నారు. బియ్యంతోపాటు రాగులు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హొళగుంద, హాలహర్వి ప్రాంతాల్లో రాగుల సరఫరా సరిగా లేదనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ కేవీఎస్ఎం ప్రసాదు, సివిల్ సప్లై డీఎం షర్మిల పాల్గొన్నారు.