గాలేరు నగరి కాల్వకు నీరు విడుదల
● గట్టెక్కనున్న మిర్చి రైతులు
కొలిమిగుండ్ల: రైతుల ప్రయోజనాల దృష్ట్యా అవుకు రిజర్వాయర్ నుంచి చెర్లోపల్లె సమీపంలోని గాలేరు నగరి వరద కాల్వకు శుక్రవారం అధికారులు నీటిని విడుదల చేశారు. కొలిమిగుండ్ల మండలంలోని పెద్దవెంతుర్ల, కమ్మవారిపల్లె, కోటపాడు తదితర గ్రామాల రైతులు మిరప పంటను విస్తారంగా సాగు చేశారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి అవుకు రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారు. సరిగ్గా నెల రోజుల క్రితం 600 క్యూసెక్కుల నీళ్లు వదలడంతో కాల్వ వెంట పంటలు సాగు చేసిన రైతులు ఆయిల్ ఇంజన్లు, కరెంట్ మోటర్ల సాయంతో పంటలకు నీళ్లు మళ్లించుకున్నారు. ప్రస్తుతం రెండో విడతలో కాల్వకు నీరు చేరడంతో కొలిమిగుండ్ల, అవుకు మండలాలతో పాటు వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలోని గ్రామాలకు రైతులకు ఉపయోగకరంగా మారింది. పంట కోత వచ్చే వరకు మిరపతో పాటు ఇతర పంటలకు నీటి తడులు పెట్టుకునేందుకు సరిపోతాయని రైతులు పేర్కొన్నారు. అడిగిన వెంటనే అధికారులతో చర్చించి రెండు సార్లు కాల్వకు నీళ్లు విడుదల చేయించడంతో ఆయా గ్రామాల రైతులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు.