తెరవెనుక డంకీ థియేటర్ రాజకీయం

సలార్ మేనియా ముందు డంకీ చిన్నబోవడం షారుఖ్ ఖాన్ బృందమే కాదు ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్లు, మీడియా సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పఠాన్, జవాన్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ప్రపంచం దద్దరిల్లే స్థాయిలో బుకింగ్స్ ఉంటాయని ఊహించుకున్న ఫ్యాన్స్ కు ప్రభాస్, షారుఖ్ ల మధ్య నెంబర్ల వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. ఎలాగైనా సలార్ ని నిలువరించేందుకు నార్త్ థియేటర్లు ముఖ్యంగా సింగల్ స్క్రీన్లను చేజిక్కించుకోవడంలో రెడ్ చిల్లీస్ సంస్థతో పాటు పెన్ స్టూడియోస్, జియో సినిమా స్క్రీన్లను తమవైపు లాగేసుకునే మంత్రాంగానికి తెరతీశారని ఇన్ సైడ్ టాక్.

కళ్ళ ముందు సలార్ డిమాండ్ కనిపిస్తున్నా సరే డంకీకి ఎక్కువ స్క్రీన్లు, షోలు పడేలా ముందస్తు బుకింగ్స్ ని వాస్తవం కన్నా ఎక్కువగా కనిపించేలా కార్పొరేట్ ఎత్తుగడలు వేస్తున్నారని వినికిడి. ఇప్పుడు సహకరించపోతే రాబోయే రోజుల్లో చేతిలో ఉన్న పెద్ద బాలీవుడ్ సినిమలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఎగ్జిబిటర్లకు ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేయడంతో దానికి భయపడి డంకీకే ప్రాధాన్యం ఇస్తున్నారని మరో వెర్షన్. యాభై వేల నుంచి లక్ష టికెట్లు అమ్ముడుపోయాయని సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లు ట్వీట్లు పెడుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో దానికి భిన్నంగా ఉంది పరిస్థితి.

కొన్ని మీడియా కథనాల ప్రకారం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ దాకా డంకీ-సలార్ ల థియేటర్ షేరింగ్ నిష్పత్తి 65-35గా ఉందని తెలిసింది. ఇవి కాకుండా యానిమల్, అక్వమెన్ లకు అవసరమైన స్క్రీన్లను రిజర్వ్ చేసి పెడుతున్నారట. హిందీ సైట్లు, పత్రికల కథనాలు సలార్ గురించి నెగటివ్ గా వండటం మొదలుపెట్టాయి. మొదటి రోజు వచ్చే హిందీ రివ్యూలు ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ప్రభావితం చేసేలా ఉంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. అయినా సలార్ కటవుట్ ని ట్రైలర్ లో చూశాక దాన్ని ఎదురుకోవడం అంత సులభం కాదని డంకీకి అర్ధమయ్యే ఉంటుంది