కౌంటర్లోనే టికెట్లు కొనాలంటే రచ్చ ఖాయం

సలార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మొదటి రోజు టికెట్ల అమ్మకాలకు పాత కాలానికి చెందిన కొత్త ఎత్తుగడను ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో కాకుండా నేరుగా థియేటర్ వద్ద కౌంటర్లో కొనేలా ఒకప్పటి ట్రెండ్ తీసుకొస్తున్నామని ప్రకటించడం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా జనాలు పేటిఎం, బుక్ మై షోలకు అలవాటు పడ్డారు. అదేపనిగా హాలు దాకా వెళ్లి క్యూలో నిలబడి కొనుక్కుని సమయం, ప్రయాణం రెండూ ఖర్చు పెట్టుకోవడం కన్నా ఓ ముప్పై రూపాయలు అదనంగా పోతే పోయిందని కంఫర్ట్ కి అలవాటు పడ్డారు.

ఇప్పుడు సలార్ కోసం కౌంటర్ల దగ్గరికి రండని పిలుపునివ్వడం బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా సమస్యలొచ్చే అవకాశాలు లేకపోలేదు. మొదటిది బ్లాక్ మార్కెట్. బలవంతుడి రాజన్నట్టు దూసుకెళ్లేవాడికే టికెట్లు దొరుకుతాయి. అవి బ్లాక్ లో బయటికొస్తాయి. పైగా గంటల తరబడి క్యూలో నిలబడి కొనేంత సహనం జనాల్లో తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్ట్రాటజీతో ఇబ్బందులకు సిద్ధపడాల్సి ఉంటుంది. ట్రేడ్ టాక్ ప్రకారం తెలంగాణలోని సింగల్ స్క్రీన్లకు ఈ పద్దతి అమలు చేస్తారట. మల్టీప్లెక్సుల వరకు అంత రిస్క్ అవసరం లేకుండా నేరుగా ఆన్ లైన్ కొనే సౌలభ్యం కొనసాగొచ్చు.

ఓపెనింగ్స్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంద నుంచి నూటా యాభై కోట్ల గ్రాస్ సులభంగా వస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. అయితే డంకీ, ఆక్వామెన్ ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే దాన్ని బట్టి ఫిగర్లలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పెంపుకి సంబందించి ఇంకా అనుమతులు రావాలి. ఏ నిమిషమైనా వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఇంకా అఫీషియల్ చేయలేదు కానీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకుని ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మొదలైనా యాప్స్ క్రాష్ అయ్యే రేంజ్ లో జనాలు మీదపడటం ఖాయం.