డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల పంచాయితీ

సంక్రాంతికి నెలకొన్న విపరీతమైన పోటీ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు జఠిలమైన సమస్యగా మారుతోంది. పైకి ఎవరికి వారు మేం థియేటర్లు మాట్లాడుకున్నాం, అగ్రిమెంట్లు చేసుకున్నాం అని చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉందని ట్రేడ్ టాక్. గుంటూరు కారం, సైంధ‌వ్‌ మాత్రమే ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నాయని, బయ్యర్లు పూర్తి సహకారం అందిస్తున్నారని సమాచారం. నా సామిరంగ ఇంకా డేట్ లాక్ చేయలేదు కాబట్టి దాని వ్యవహారం తేలాల్సి ఉంది. హనుమాన్, ఈగల్ మాకు సరిపడా ఉన్నాయని వాటితో సర్దుకుంటామని అంటున్నాయి.

వీటి సంగతి కాసేపలా పక్కనపెడితే ఇదే పండగకు మూడు డబ్బింగ్ సినిమాలున్నాయి. అవేవో ఆషామాషీ చిన్న హీరోలవి కాదు. తెలుగులో మార్కెట్ ఉన్నవాళ్లవే. ధనుష్ కెప్టెన్ మిల్లర్, రజనీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలన్ లు ఇక్కడ కూడా సమాంతర రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి. నిర్మాతలు ఇంకా ఫైనల్ కాలేదు. సో డిస్ట్రిబ్యూటర్లెవరో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అలా అని ఎవరూ కొనకుండా ఉండరు. అన్నీ పెద్ద బ్యానర్లే. ఆయా నిర్మాతలకు టాలీవుడ్ లో బలమైన లింకులున్నాయి. ఏదో ఒకరకంగా దొరికినన్ని స్క్రీన్లతో వేయించేలా తెరవెనుక వ్యవహారం నడిపిస్తారు.

పోనీ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలాంటి టైంలో డబ్బింగులు అనుమతులు లేవు లేదా థియేటర్ల సర్దుబాటు కుదరదు లాంటి కండీషన్లు పెడతారా అంటే అదీ లేదు. తమిళనాడులో అయితే నిర్మొహమాటంగా ఇతర బాషా చిత్రాలను పండగ సీజన్ లో పక్కకు తోసేస్తారు. కానీ మనదగ్గర అలా కుదరదు.అనువాదాలే కాబట్టి లేట్ రిలీజ్ చేసుకోవచ్చు కదాని అడగొచ్చు. కానీ అగ్రిమెంట్ల టైంలో అన్ని భాషల్లో సమాంతర విడుదలకు పట్టుబడుతున్నాయి ఓటిటి సంస్థలు. అందుకే ఈ చిక్కులు. గతంలో వారసుడు,పేట లాంటివి వచ్చినప్పుడు తలెత్తిన ఇబ్బంది ఈసారి తీవ్రస్థాయిలో ఉండనుంది. చూడాలి ఏం జరుగుతుందో.