పీఎం కిసాన్ నిధుల పెంపు యోచనలో ప్రభుత్వం

by Disha Web Desk 12 |
పీఎం కిసాన్ నిధుల పెంపు యోచనలో ప్రభుత్వం
X

దిశ, కామారెడ్డి : వ్యవసాయ రంగంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. పీఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలు లేదా 10 వేలకు పెంచాలన్న అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2018 లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తూ వస్తోంది.

ఈ పధకం అమల్లోకి వచ్చాక గత ఏడాది నవంబర్‌లో 15వ విడత నిధులు రైతుల ఖాతాకు జమ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో 16వ విడతగా పీఎం కిసాన్ నిధులు జమ చేసే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు పెంచిన తర్వాతే రైతులకు పెంచిన నిధులు విడుదల చేసి ఆ మేరకు బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

జిల్లాలో 1.67 లక్షల మంది రైతులకు జరగనున్న మేలు

ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి కింద లబ్ధి పొందే రైతులు జిల్లాలో లక్ష 67 వేల తొమ్మిది మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటివరకు 417 కోట్ల 35 లక్షల 26 వేల రూపాయలు జమ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచాలని భావిస్తున్న ఈ నిధులతో ఎంతో మేలు జరగనుంది.


Next Story

Most Viewed